అమెరికాకు చెందిన దిగ్గజ ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ సంస్థ టెస్లాకు ఫ్లోరిడా కోర్టు భారీ జరిమానా విధించింది. 2019లో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో టెస్లా కారులోని ఆటో పైలట్ వ్యవస్థ లోపం వల్లే ప్రమాదం జరిగిందని ఫ్లోరిడా కోర్టు తేల్చింది. దీంతో బాధిత కుటుంబానికి 242 మిలియన్ డాలర్ల పరిహారం (భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ.2,100 కోట్లు) చెల్లించాలని సదరు కంపెనీని కోర్టు ఆదేశించింది.
కేసు వివరాల్లోకి వెళితే.. ఫ్లోరిడాలోని కీ లార్గోలో 2019లో ఈ ఘటన జరిగింది. జార్జ్ మెక్ గీ అనే వ్యక్తి తన టెస్లా కారులో వెళుతూ అత్యాధునిక ఆటో పైలట్ ఫీచర్ను ఉపయోగించాడు. ఇది టెస్లా అందించిన ఆటోమేటెడ్ డ్రైవింగ్ వ్యవస్థ. మార్గమద్యంలో జార్జ్ మొబైల్ కారులో కింద పడిపోయింది. కారు ఆటో పైలట్ మోడ్లోనే ఉందని భావించిన జార్జ్ కిందకు వంగి ఫోన్ తీసుకునేందుకు ప్రయత్నించాడు.
అయితే ఆ సమయంలో కారు అదుపు తప్పి పక్కనే పార్క్ చేసి ఉన్న మరో కారును ఢీకొట్టి ఇద్దరు వ్యక్తులపైకి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో 22 ఏళ్ల యువతి అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై బాధిత కుటుంబాలు కోర్టును ఆశ్రయించగా, సుదీర్ఘ విచారణ అనంతరం తాజాగా ఫ్లోరిడా కోర్టు తీర్పు వెల్లడించింది.
