ప్రముఖ సినీ హీరో మహేశ్ బాబు ఫౌండేషన్ తొమ్మిదేళ్ల చిన్నారికి గుండె శస్త్ర చికిత్స చేయించి పునర్జన్మ ప్రసాదించింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం కుముదవల్లికి చెందిన తొమ్మిదేళ్ల చిన్నారి పిల్లి వర్షితకు మహేశ్ బాబు ఫౌండేషన్ గుండె శస్త్ర చికిత్స చేయించింది.వివరాల్లోకి వెళితే.. కుముదవల్లికి చెందిన విజయకుమార్, మార్తమ్మ దంపతుల చిన్నారి వర్షితకు పుట్టుకతోనే గుండెలో రంధ్రం ఏర్పడింది. వయసు పెరిగే కొద్దీ దానికదే పూడిపోతుందని అప్పట్లో వైద్యులు చెప్పారు. అయితే, తొమ్మిదేళ్లు వచ్చినా గుండెకు ఉన్న రంద్రం పూడకపోవడంతో అనారోగ్య సమస్యలు తలెత్తాయి.భీమవరంలో ప్రైవేటు ఆసుపత్రిలో చూపించగా శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు తెలిపారు. పెయింటర్గా జీవనం సాగించే విజయకుమార్కు తన కుమార్తెకు గుండె శస్త్ర చికిత్స చేయించేంత ఆర్ధిక స్థోమత లేక ఆవేదన చెందాడు.
