క్షుద్రపూజల అనుమానంతో వ్యక్తిని చంపి జననాంగాలు కోసి.. ఒడిశాలో దారుణం!

Picture of Victory Media Tv

Victory Media Tv

ఒడిశాలోని గజపతి జిల్లాలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. క్షుద్ర పూజలు చేస్తున్నాడనే అనుమానంతో 35 ఏళ్ల వ్యక్తిని గ్రామస్థులు దారుణంగా హత్య చేశారు. గుండు కొట్టి చంపడమే కాకుండా, అతడి జననాంగాలను సైతం కోసివేసినట్టు పోలీసులు తెలిపారు.
ఈ దారుణం మోహనా పోలీస్ స్టేషన్ పరిధిలోని మలసపదర్ గ్రామంలో శనివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సుమారు రెండు వారాల క్రితం గ్రామంలో ఒక మహిళ చనిపోయింది. ఈ మరణానికి క్షుద్ర పూజలే కారణమని, ఆ వ్యక్తిపై గ్రామస్థులు అనుమానం పెంచుకున్నారు.
గ్రామస్థుల నుంచి బెదిరింపులు రావడంతో ఆ వ్యక్తి తన కుటుంబాన్ని తీసుకొని గంజాం జిల్లాలోని అత్తగారింటికి వెళ్లిపోయాడు. ఊళ్లోని తన పశువులను చూసుకోమని వదినను కోరాడు. శనివారం తన పశువులను, మేకలను తీసుకెళ్లడానికి తిరిగి గ్రామానికి రాగా, గ్రామస్థులు అతడిని కిడ్నాప్ చేశారు.
ఆ తర్వాత అతడిని గొంతు పిసికి చంపి, జననాంగాలను కోసివేశారు. అనంతరం శవాన్ని సమీపంలోని హరభంగీ డ్యామ్‌లో పడేశారు. ఆదివారం ఉదయం రిజర్వాయర్ నుంచి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం కోసం పంపించారు. ఈ ఘటనకు సంబంధించి గ్రామానికి చెందిన 14 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ సురేష్ చంద్ర త్రిపాఠీ తెలిపారు.

Leave a Comment

Leave a Comment