ముంబ‌యి లోకల్ ట్రైన్‌లో ఘోరం.. ఫోన్ లాక్కెళ్లిన దొంగ.. కాలు కోల్పోయిన ప్రయాణికుడు

Picture of Victory Media Tv

Victory Media Tv

ఓ సెల్ ఫోన్ దొంగతనం ప్రయాణికుడి జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసింది. కదులుతున్న రైలులోంచి కిందపడటంతో అతడి కాలు చక్రాల కింద నలిగిపోయింది. ముంబ‌యి లోకల్ ట్రైన్‌లో ఆదివారం చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే… థానే జిల్లాకు చెందిన గౌరవ్ నికమ్ అనే వ్యక్తి ముంబై లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తున్నాడు. రద్దీగా ఉండటంతో రైలు డోర్ దగ్గరే నిలబడి ఉన్నాడు. ఇదే అదనుగా భావించిన ఓ దొంగ, అతడి చేతిలో ఉన్న మొబైల్ ఫోన్‌ను ఒక్కసారిగా లాక్కున్నాడు. ఈ హఠాత్పరిణామంతో గౌరవ్ నికమ్ అదుపుతప్పి కదులుతున్న రైలులో నుంచి కిందకు జారిపడ్డాడు. దురదృష్టవశాత్తు అతడి కాలు రైలు పట్టాలపై పడటంతో, రైలు చక్రాలు దానిపై నుంచి వెళ్లాయి. ఈ ప్రమాదంలో అతడి కాలు నుజ్జునుజ్జయింది.
ప్రమాదాన్ని గమనించిన తోటి ప్రయాణికులు వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది, తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న గౌరవ్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

Leave a Comment

Leave a Comment