తెలంగాణలోని గద్వాల జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ప్రైవేటు సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి కీలక వివరాలు వెల్లడించారు. వివాహమైన నెల రోజులు కూడా గడవకముందే భార్య ఐశ్వర్య తన ప్రియుడు తిరుమల్రావుతో కలిసి కిరాయి హంతకుల (సుపారీ గ్యాంగ్) సాయంతో భర్త తేజేశ్వర్ను హత్య చేయించినట్లు గద్వాల ఎస్పీ గురువారం మీడియాకు తెలిపారు. ఈ దారుణ ఘటన వెనుక ఉన్న కుట్ర కోణాలను ఆయన వివరించారు.ఈ నెల 17న తేజేశ్వర్ అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం ఈ నెల 21న గాలేరు-నగరి కాల్వలో తేజేశ్వర్ మృతదేహం లభ్యమైందని ఎస్పీ తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, పోస్టుమార్టం అనంతరం హత్యగా నిర్ధారించి దర్యాప్తును వేగవంతం చేశారు.ఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం ఐశ్వర్య తన ప్రియుడు తిరుమల్రావుతో కలిసి తేజేశ్వర్ను అంతమొందించాలని పక్కా ప్లాన్ వేసింది. ఇందుకోసం వారు సుపారీ గ్యాంగ్ను ఆశ్రయించారు. తేజేశ్వర్ కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు నిందితులు జీపీఎస్ ట్రాకర్ను ఉపయోగించారని ఎస్పీ వివరించారు. పథకం ప్రకారం ముగ్గురు వ్యక్తులు కలిసి తేజేశ్వర్ను కారులో బలవంతంగా తీసుకెళ్లి హత్య చేశారని ఆయన తెలిపారు.
