ఓవైపు ప్రాణాలు పోతున్నా పట్టించుకోకుండా సబ్బుల పెట్టెలు ఎత్తుకెళ్లిన జనం..

Picture of Victory Media Tv

Victory Media Tv

కళ్ల ముందే ఘోర ప్రమాదం.. లారీ, ట్యాంకర్ ఢీకొని డ్రైవర్ అక్కడికక్కడే మరణించగా తీవ్ర గాయాలతో క్లీనర్ సాయం కోసం వేడుకుంటున్నాడు. వెంటనే స్పందించి సాయం అందించాల్సిన స్థానికులు మాత్రం మానవత్వం మరిచి లారీలోని సబ్బులను ఎత్తుకెళ్లడంలో మునిగిపోయారు. విషయం తెలిసి పోలీసులు అక్కడికి చేరుకునేలోగా లారీలోని సగం లోడును ఖాళీ చేసేశారు. ఈ అమానవీయ ఘటన మంచిర్యాల జిల్లాలో ఈ రోజు ఉదయం చోటుచేసుకుంది.
లక్సెట్టిపేట నుంచి రాయచూర్‌కు సబ్బుల లోడుతో వెళ్తున్న లారీని ఇటిక్యాల సమీపంలో ఎదురుగా వస్తున్న ట్యాంకర్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాల ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. లారీ క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్ అక్కడికక్కడే మరణించాడు. ట్యాంకర్ డ్రైవర్, క్లీనర్ తీవ్రంగా గాయపడ్డారు.ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న కొందరు స్థానికులు గాయపడిన వారిని పట్టించుకోకుండా లారీలోని సబ్బులను దోచుకోవడానికి పోటీపడ్డారు. బాధితుల ఆర్తనాదాలు వారిని కదిలించలేకపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆలోపే లారీలోని సగానికి పైగా సబ్బుల లోడును జనం ఎత్తుకెళ్లారు.

Leave a Comment

Leave a Comment