ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలకు అన్ని విధాలుగా అండగా నిలవాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. వారికి అన్ని రకాల అవకాశాలను కల్పించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాలను చేరువ చేయాలని సూచించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ మీటింగు హాలులో జిల్లా విజిలెన్స్ & మానటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, ఉత్తర ఎమ్మెల్యే విష్టు కుమార్ రాజు, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ, జిల్లా రెవెన్యూ అధికారి బి.హెచ్.భవాని శంకర్, విశాఖపట్నం, బీమిలి ఆర్.డి.ఒ లు శ్రీ లేఖ, సంగీత్ మహాదూర్, డీసీపీలు, ఏసీపీలు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ రామారావు, విజిలెన్స్ కమిటీ సభ్యులు భాగస్వామ్యమయ్యారు.
సమావేశంలో భాగంగా ఇప్పటి వరకు నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల వివరాలను సాంఘిక సంక్షేమ శాఖ డీడీ వివరించారు. ఇన్వెస్టిగేషన్, విచారణ దశలో ఉన్న కేసుల గురించి తెలిపారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో నమోదైన కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని సూచించారు. బాధితులకు నిర్ణీత కాలంలో నష్టపరిహారం చెల్లించాలని చెప్పారు. డివిజన్, మండల స్థాయిల్లో సివిల్ రైట్స్ డేలను నిర్వహించాలని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణ, దర్యాప్తు విషయంలో జాగ్రత్త వహించాలని, బాధితులకు అండగా నిలవాలని అధికారులకు సూచించారు. ఈ క్రమంలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇటివల ఆక్సీజన్ టవర్స్ లో జరిగిన ఘటన గురించి ఉత్తర ఎమ్మెల్యే విష్టు కుమార్ రాజు ప్రస్తావించి పోలిసు పని తీరు ను ప్రశంశించారు
