లిక్కర్ కుంభకోణం కేసు పూర్తిగా కల్పితమని, కేవలం వైసీపీ ఇమేజ్ ను దెబ్బతీసి, ఆ పార్టీ నాయకులను వేధించేందుకే ఈ కేసును బనాయించారని మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడికి సంబంధించిందంటూ ప్రచారంలో ఉన్న వీడియో, అసలు విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నంలో భాగమేనని విమర్శించారు.
ఆ వీడియోలో కనిపిస్తున్న రూ.2000 నోట్ల కట్టలే ప్రభుత్వ కుట్రకు నిదర్శనమని అంబటి పేర్కొన్నారు. “ఎన్నికలు జరిగింది 2024 మే నెలలో. రూ.2000 నోట్లను రిజర్వ్ బ్యాంక్ మే 2023 నాటికే చెలామణి నుంచి ఉపసంహరించుకుంది. ఇప్పుడు బయటపెట్టిన వీడియోలో స్పష్టంగా రూ.2000 నోట్ల కట్టలు కనిపిస్తున్నాయి. దీన్నిబట్టి ఎన్నికల్లో లిక్కర్ వ్యాపారంతో వచ్చిన డబ్బును చెవిరెడ్డి పంపిణీ చేశారన్న ఆరోపణ అబద్ధమని వారే ఒప్పుకున్నట్టు కాదా?” అని అంబటి ప్రశ్నించారు. ఈ వీడియోను లిక్కర్ కేసుకు ముడిపెట్టడం ద్వారా, చంద్రబాబు వేసిన సిట్ కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు.
